వైసీపీ దురాగతాలకు బలైన తెలుగుదేశం కారకర్యలకు న్యాయం చేయాలని,  ప్రభుత్వ బాధితులను ఆదుకోవాలని టీడీపీ పోరాటం చేస్తుంటే, వారికి వ్యతిరేకంగా కక్షసాధింపు ధోరణితో రివర్స్‌లో కేసులు పెడుతూ, బాధితుల్నే దోషుల్ని చేస్తూ వారినే పోలీస్‌స్టేషన్లకు తరలించడం ఈ ప్రభుత్వంలోనే జరుగుతోందని టీడీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికతో బాధితుల్ని, నష్టపోయిన వారిని దోషులుగా చిత్రీకరిస్తూ, దాడిచేసిన వారిని, టీడీపీ కార్యకర్తల ఆస్తులు, పొలాలు ధ్వంసం చేసిన వారినేమో బాధితులుగా చిత్రీకరించే కుట్రకు తెరలేపిందని డొక్కా వాపోయారు.  ఈ తరహాచర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏమాత్రం మంచిదికాదన్న ఆయన, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వమే రెచ్చగొట్టేలా, అధికారులు అత్యుత్సాహంతో దుందుడుకు చర్యలకు పాల్పడటం సరికాదని హితవుపలికారు. 


ఉభయపక్షాలను సమావేశపరిచి, శాంతిభద్రతలను కాపాడాల్సినవారే దాడులుచేసే వారికి కొమ్ముకాయడం ఏమాత్రం భావ్యం కాదన్నారు. ఆత్మకూరు సంఘటనల తర్వాత శాంతిభద్రతలు రక్షించేలా చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, వరుసగా దుర్ఘటనలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం విచారకరమని మాణిక్యవర ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. మాపార్టీ అధినేతను కలవడానికి వెళ్తున్న టీడీపీ శాసనసభాపక్ష నేత అచ్చెన్నాయుడిని బలవంతంగా నిర్బంధించడం ఏమిటని, ఒక్కడే ఆయన కారులో వెళ్తుంటే అడ్డుకొని, ఉండవల్లిలో కేసునమోదైతే, పాతకేసులంటూ టెక్కలి పోలీసులు అరెస్ట్‌కు యత్నించడం ఎంతవరకు సమంజసమని డొక్కా ప్రశ్నించారు. 


సోషల్‌మీడియాలో కూడా మహిళలని కూడా చూడకుండా అసభ్యంగా, అభ్యంతరకరంగా  వైసీపీవాళ్లు చేస్తున్న వ్యాఖ్యలను, పోలీసులు ఎందుకు నిరోధించలేకపోతున్నారన్నారు. తమ పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ గారిని, ఆయన కుటుంబసభ్యులను దూషిస్తూ, సోషల్‌మీడియాలో  జరిగిన అసభ్య ప్రచారాన్ని ఈ సందర్భంగా డొక్కా ప్రస్తావించారు. టీడీపీవాళ్లు, బాధితులు ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసులు, వైసీపీ వారిచ్చే ఫిర్యాదులపై మాత్రం మితిమీరిన అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న విషయాలను కూడా డీజీపీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: