రామన్ అచ్చమైన భారతీయునిగా ఈ గడ్డపైనే చదువుకుని, తలమానికమైన పరిశోధనలు జరిపి సైన్స్‌ లో దేశ శక్తిసామర్ధ్యాలను ప్రపంచానికి చాటి చెప్పి భారత్‌ కు నోబెల్ సాధించిపెట్టారు.  పరిశోధనల కోసం విదేశీయులే భారత్ కి రావాలని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి సర్ సీవీ రామన్. రామన్ ముందు వరకూ సైన్స్‌ లో నోబెల్ బహుమతులు పాశ్చాత్యులకే దక్కేవి. కానీ, ‘నా మతం సైన్సు.. దానినే జీవితాంతం ఆరాధిస్తా..’ అని చెప్పి తుదిశ్వాస వరకూ శాస్త్రాన్వేషణలోనే గడిపారు.

 

 

1888 నవంబరు 7న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మాళ్ దంపతులకు రామన్ జన్మించారు. విశాఖపట్నంలో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన రామన్ చిన్ననాటి నుంచే విజ్ఞాన శాస్త్ర విషయాలపై అమితాసక్తిని ప్రదర్శించేవారు. తండ్రి కూడా భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు కావడంతో దానిపై మరింత కుతూహలం పెంచుకున్నారు. తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ 12 ఏళ్లకే మెట్రిక్యులేషన్ పూర్తి చేసి ఫిజిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించారు. ఆ తర్వాత మద్రాస్ యూనివర్సిటీ నుంచి భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఆ సబ్జెక్టులోనూ గోల్డ్ మెడల్ సాధించిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.

 

 

పద్దెనిమిదేళ్ల వయసులో కాంతికి సంబంధించిన ధర్మాలపై రామన్ రాసిన పరిశోధనా వ్యాసాలు లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమయ్యాయి. పరిశోధనల పట్ల అయనకున్న అభిరుచిని గమనించిన అధ్యాపకులు ఇంగ్లాండు వెళ్లాలని సలహా ఇచ్చారు. అయితే ఇంగ్లాండు వాతావరణానికి ఆయన ఆరోగ్యం సరిపడదని ప్రయాణాన్ని విరమించుకున్నారు. ఆ తర్వాత ఫైనాన్స్ విభాగంలో ఉద్యోగిగా చేరిన సీవీ రామన్ 1907లో బాధ్యతల రీత్యా కలకత్తాకు బదిలీ అయ్యారు.

 

అక్కడ ఇండియన్ సైన్స్ అసోసియేషన్‌కు రోజూ వెళ్లి పరిశోధనలు చేసేవారు. రామన్ ఆసక్తిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ అశుతోష్ ముఖర్జీ.. నాటి బ్రిటీష్ ప్రభుత్వానికి లేఖ రాశారు. రామన్ పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే బాగుంటుందని ఆ లేఖలో సూచించారు. అయితే బ్రిటీష్ ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసిన రామన్ పరిశోధనలపై పూర్తిస్థాయి సమయాన్ని వెచ్చించారు.

ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసిఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణులై కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరారు. ఒకసారి కలకత్తాలో వీధుల్లో తిరుగుతుండగా బౌబజారు స్ట్రీట్ దగ్గర ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూశారు. ఆ సంస్థ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్‌ను కలిసి పరిశోధన చేయడానికి అనుమతిని పొందారు.

 

 

రామన్ తల్లి పార్వతి అమ్మాళ్ వీణను అద్భుతంగా వాయించేవారు. అందుకే రామన్ తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం లాంటి సంగీత వాయిద్య పరికరాలపై సాగింది. విజ్ఞాన పరిశోధనలపై తృష్ణతో ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరారు. తాను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై 1921లో లండన్‌లో ఉపన్యాసాలు ఇచ్చారు. శ్రోతల్లోని ఓ వ్యక్తి ఇలాంటి అంశాలతో రాయల్ సొసైటీ సభ్యుడవుదామని భావిస్తున్నావా అంటూహేళన చేశాడు.

 

దీంతో రామన్‌కు పరిశోధనలపై మరింత పట్టుదల పెరిగింది. శబ్దశాస్త్రం నుంచి తన పరిశోధనలను కాంతివైపు మళ్లించారు. ఇంగ్లాండు నుంచి తిరిగొస్తూ ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు రెండూ నీలిరంగులో ఉండటాన్ని ఏంతో ఆసక్తితో గమనించాడు. అప్పటిదాకా అనుకుంటున్నట్లు సముద్రపు నీలం రంగుకు కారణం ఆకాశపు నీలిరంగు ప్రతిబింబంగా ఏర్పడటం కాదని.... సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణమని ఊహించాడు. కలకత్తా చేరుకోగానే తన ప్రాకల్పనలను నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్థాల కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో యువశాస్త్రవేత్తలైన కె.ఆర్.రామనాథన్, కె.యస్ .కృష్ణన్ ఆయనకు అండగా నిలిచారు. 1927 ఏడాదికి భౌతికశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి పొందిన కాంప్టన్ ఎక్స్ కిరణాలు పరిశోధన నిజమైనపుడు, కాంతి విషయంలోనూ అది నిజం కావాలంటూ ఆలోచనలో పడ్డాడు.

 

 

ఆ ఆలోచనే రామన్ ఎఫెక్ట్‌కు దారితీసింది. అధునాతనమైన పరికరాలు లేకపోయినా తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంగా ఉన్న రామన్ అనుకున్నట్లుగానే 1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నారు. పారదర్శకంగా ఉన్న ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా కాంతి ప్రసరించినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుందని రామన్ ఎఫెక్ట్ ద్వారా నిరూపించారు. ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో వెల్లడించారు.

 

నాటి బ్రిటీష్ ప్రభుత్వం 1929లో నైట్ హుడ్ బిరుదుతో రామన్ ను సత్కరించింది. రామన్ ఎఫెక్ట్ అసామాన్యమైందని కేవలం రూ.200 కూడా విలువలేని పరికరాలతో దృగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమైందని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ కొనియాడారు. ఈ పరిశోధనను గుర్తించిన రాయల్ స్వీడిష్ అకాడమీ భౌతికశాస్త్రానికి 1930లో నోబెల్ బహుమతి ప్రధానం చేసింది. సైన్స్‌కు రామన్ చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయనకు 1954లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించింది. చివరి వరకు భారతదేశంలో సైన్స్ అభివృద్దికి పాటుపడ్డ సీవీ రామన్ 1970 నవంబర్ 21న కన్నుమాశారు.

 

 

భారతరత్న అందుకున్న సమయంలో రామన్ చేసిన ప్రసంగం నేటి యువతకు ఎంతో ప్రేరణగా నిలుస్తుంది. ‘విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు.. నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి’ అంటూ రామన్ చేసిన ప్రసంగం నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ఉదయాకాశం వెలుగుల్లో చెట్లు ఎంత అందంగా కనబడతాయో మీరు ఎప్పుడైనా గమనించారా? నాకు వీటిని చూస్తూ ఉంటే స్పటిక నిర్మాణం గురించిన ఆలోచనలు వస్తుంటాయి.. అందుకే‘విజ్ఞానం అత్యుత్తమైన సృజనాత్మక కళారూపం’ అని రామన్ ఎప్పుడూ చెబుతుండేవారు. రామన్ జీవితంలో మరో మైలురాయి రామన్ ఎపెక్ట్ సిద్దాంతం.. వస్తువు మీద కాంతి కిరణం పడితే అది పరివర్తనం చెందుతుందని.. దానివల్లనే అది తన గమనాన్ని మార్చుకుంటుందని తన సిద్దాంతాల ద్వారా రుజువు చేశారు రామన్. అప్పటికున్న అరకొర సదుపాయాలతోనే మన దేశ విజ్ఞాన కిరణాలను నలుదిశలా ప్రసరింపజేశారు.

 

 

1927లో భౌతిక శాస్త్రంలో కాంప్టన్ నొబెల్ బహుమతి పొందినప్పుడు రామన్‌లో సరికొత్త ఆశలను రేకెత్తించాయి. కాంప్టన్ ఫలితం ఎక్సరేస్ విషయంలో నిజమైనప్పుడు కాంతి విషయంలో నిజం కావాలి కదా అనే ఆలోచనలో పడ్డారు. ఆ ఆలోచనే రామన్ ఎఫెక్టుకు దారితీసింది. అధునాతనమైన పరికరాల్లేకపోయినా రామన్ తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంతోనే అడుగులు వేశారు. సూర్యుని నుంచి వెలువడే తెలుపు రంగు కాంతి వాయువులోని అణువులపై పడి, వాటి ప్రయాణ దిశను మార్చుకుంటాయని తన పరిశోధనల ద్వారా రుజువు చేశారు. వస్తువు మీద కాంతి కిరణం పడితే అది పరివర్తనం చెందుతుందని 1928 ఫిబ్రవరి 28న రామన్ తొలిసారిగా ప్రకటించారు.

 

 

పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు పదార్థాల గుండా కాంతిని ప్రసరించేటప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది.. ఈ విషయాన్ని 1928 మార్చి 16న బెంగుళూరులో శాస్త్రజ్ఞుల సదస్సులో నిరూపించాడు. అనుకున్నట్లే 1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్టును ఆవిష్కరించారు. ఈ పరిశోధనను అభినందిస్తూ బ్రిటీష్ ప్రభుత్వం 1929 లో నైట్ హుడ్ బిరుదుతో సత్కరించింది. ఈ రామన్ ఎఫెక్టు అసామాన్యమైనదని, అందులో రూ.200 కూడా ఖర్చుచేయని పరికరాలతో ఆ విషయ నిరూపణ జరగడం అద్భుతమని ప్రపంచ శాస్త్రజ్ఞులంతా రామన్‌ను అభినందించారు.

 

 

అనన్య సామాన్య పరిశోధనా సామర్ధ్యంతో ఫిజిక్స్ రంగంలో రామన్ ఎఫెక్ట్ కనుగొని చరిత్ర సృష్టించిన ఫిబ్రవరి 28 నే జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. 1987 ఫిబ్రవరి నుంచి ఏటా జాతీయ సైన్స్ దినోత్సవంగా భారత ప్రభుత్వం అధికారకంగా జరుపుతోంది. ఏటా ఏదో ఒక అంశాన్ని ప్రధానంగా తీసుకుంటారు. ఈ ఏడాది ‘ఉమెన్ ఇన్ సైన్స్’ థీమ్‌‌గా ఎంచుకున్నారు. శాస్త్ర పరిశోధనల్లో మహిళలు మరింత చురుకుగా పాల్గొనేలా చేయాలని, వారికి ఈ రంగంపై ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతో దీనిని ఎంపిక చేశారనీ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: