చంద్రశేఖర వేంకట రామన్ తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో తిరువనైకోవిల్ గ్రామంలో 1888వ సంవత్సరం నవంబర్ ఏడవ తేదీన జన్మించారు. రామన్ తండ్రి ఆర్. చంద్రశేఖర అయ్యర్ కళాశాల అధ్యాపకులు. గణిత, భౌతిక శాస్త్రాలను బోధించేవారు. తల్లి పార్వతి అమ్మాళ్ గృహిణి. ఈ దంపతుల రెండవ సంతానమే వేంకట రామన్. ఈయన చిన్నతనంలో చంద్రశేఖర అయ్యర్‌ కు విశాఖపట్నం ఎ.వి.ఎన్. కళాశాలలో భౌతిక శాస్త్రాధ్యాపకునిగా ఉద్యోగం వచ్చింది. దాంతో ఆ కుటుంబం విశాఖపట్నానికి మారింది. వేంకట రామన్... విశాఖలోని సెయింట్ ఎలాషియస్ ఆంగ్లో ఇండియన్ పాఠశాలలో విద్యను అభ్యసించారు. ఆయన 12 సంవత్సరాలకే మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడైన ప్రతిభాశాలి. 

 

ఆ రోజుల్లో ఇలాంటి మేధావులకు ప్రభుత్వ ప్రోత్సాహం బాగా ఉండేది. సర్కారు ఖర్చుతో ఉన్నత విద్యాభ్యాసానికి ఇంగ్లండు పంపేవారు. సి.వి.రామన్‌ కు ఆ అవకాశం వచ్చినప్పటికీ ఆరోగ్య కారణాల దృష్ట్యా వైద్యుల ఆమోదం లభించలేదు. ఆ కారణంగా ఆయన ఇంగ్లండ్‌ కు వెళ్లలేకపోయారు. కాలేజీ చదువులకు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు. రామన్ 1904లో బంగారు పతకంతో బీఏ పట్టా అందుకున్నారు. రామన్ 1906లో అమ్మాళ్‌ను వివాహమాడారు. వీరికి చంద్రశేఖర్, రాధాకృష్ణన్ అనే ఇద్దరు కుమారులు. సి.వి.రామన్ తన జీవితమంతా భౌతిక శాస్త్ర పరిశోధనలకే అంకితమై, అంతిమ క్షణాల వరకూ భౌతికశాస్త్ర విషయాలతోనే గడిపారు. రామన్ ఎఫెక్ట్ అనువర్తనాలతో వెయ్యికి పైగా పరిశోధన వ్యాసాలు ప్రచురితమయ్యాయి. 1907లో భౌతిక శాస్త్రంలో ఎమ్మెస్సీ పట్టా సాధించారు. కాంతి విక్షేపణ, వివర్తనలపై రాసిన థీసిస్ 1906లో ప్రచురితమైంది.

 

 రామన్ 1921వ సంవత్సరంలో కలకత్తా విశ్వవిద్యాలయం తరఫున ఇంగ్లండులోని ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆయన సముద్ర యానం చేశారు. ఆ ప్రయాణంలో ఓడ పైనుండి సముద్రాన్ని వీక్షించిన రామన్ మదిలో ఎన్నో సందేహాలు మొలకెత్తాయి. సముద్ర జలాలు ఆకుపచ్చ - నీలి రంగుతో ఎందుకు కనిపిస్తాయి? అనే సందేహం ప్రధానమైనది. కలకత్తాకు చేరగానే కాంతి వివర్తనం, విక్షేపాలపై ప్రయోగాలు ప్రారంభించారు. ఈ ప్రయోగాల ఫలితంగా రామన్ విజ్ఞాన శాస్త్ర ప్రపంచంలోనే అత్యంత ప్రభావం కలిగిన ‘రామన్ ఫలితాన్ని’ కనుగొన్నారు.

 

 

 ఫలితంగా డాక్టర్ చంద్రశేఖర వేంకట రామన్‌కు 1930వ సంవత్సరపు నోబెల్ బహుమతి ప్రకటించారు. నోబెల్ పురస్కారం లభించిన తర్వాత కూడా రామన్ శబ్ద తరంగాలపై పరిశోధనలను కొనసాగించారు. భారతీయ సంగీత వాద్యాలైన వయొలిన్, మృదంగం మొదలైన వాద్యాలలో శబ్ద తరంగాలు ఏ విధంగా శృతి పేయమైన శబ్దాలను ఉత్పాదిస్తాయో కనుగొని ఆ పరిశోధనలను ప్రచురించారు. భౌతిక, విజ్ఞాన శాస్త్రంలో రామన్ ప్రతిభకు తార్కాణంగా ప్రపంచంలోని ఎన్నో విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్‌లు లభించాయి. భారత ప్రభుత్వం సి.వి.రామన్ ప్రతిభ, భారతదేశానికి పేరు తెచ్చిన ఆవిష్కరణలకు గుర్తింపుగా ఆయనను 1954లో ‘భారతరత్న’ బిరుదుతో సత్కరించింది.

 

 

 రామన్‌కు ‘భారతరత్న’ పురస్కారం లభించినప్పుడు, ఆ పురస్కారం అందుకోవటానికి ఢిల్లీకి రమ్మని స్వయంగా అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ నుంచి ఆహ్వానం వచ్చింది. అందుకు రామన్ రాసిన జవాబే ఆయన వ్యక్తిత్వానికి ఒక నిదర్శనం. ‘‘మీరు నాపై చూపిన ఆదర సత్కారాలకు కృతజ్ఞుణ్ని. ప్రస్తుతం నేను నా విద్యార్థి ఒకరి పీహెచ్‌డీ పరిశోధన వ్యాసం పరిశీలనలో తుది దశలో ఉన్నాను. నా విద్యార్థి భవిష్యత్తు దృష్ట్యా ‘థీసిస్’ పని వాయిదా వేయలేను, క్షంతవ్యుడను’. ఈ ఉత్తరం సర్ రామన్‌కు తన కర్తవ్య ధర్మం పట్ల గల శ్రద్ధను తెలియపరుస్తుంది. 1943లో భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఛి)లో రిటైర్ అయిన వెంటనే బెంగళూరులో రామన్ పరిశోధనా సంస్థను స్థాపించారు. ఆ సంస్థలోనే 1970, నవంబర్ 21వ తేదీన అంతిమ శ్వాస తీసుకున్నారు.

 

 

 రామన్‌కు లభించిన గౌరవ పురస్కారాలు

 

     1924 -    రాయల్ సొసైటీ ఫెలోషిప్ ఊఖ

     1929 - బ్రిటిష్ మహారాణి నుండి నైట్‌హుడ్, సర్

     1930 - నోబెల్ పురస్కారం

     1941 - ఫ్రాంక్లిన్ పతకం

     1954 - భారతరత్న

     1957 - లెనిన్ శాంతి బహుమతి

     1917 - ఐఅఇ గౌరవ కార్యదర్శి

     1933 - 48 భారతీయ విజ్ఞాన సంస్థ బెంగళూరులో ప్రొఫెసర్, 1948లో ఐఐఛిడెరైక్టర్

 

 రామన్ రాసిన గ్రంథాలలో కొన్ని

 

 1. కాంతి వివర్తనము (scattering of light)

 2. అకాస్టిక్ (Acoustic) నాద తరంగ శాస్త్రం

 3. ఆప్టికా (Optica) దృగ్గోచర కాంతి శాస్త్రం

 4. ఖనిజములు, వజ్రముల కాంతి ధర్మాలు

 5. స్ఫటికముల భౌతిక విజ్ఞానం

 6. పుష్పాల రంగుల - అవగాహన

 7. వీణ, వయొలిన్, తబల, మృదంగం మొదలైన సంగీత వాద్యాలలో శబ్ద తరంగాలు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: